ఇద్దరినీ చంపేయాలనుకున్నా! | Sakshi
Sakshi News home page

ఇద్దరినీ చంపేయాలనుకున్నా!

Published Thu, Jun 28 2018 2:33 PM

Honor Murder In PSR Nellore - Sakshi

కోట: చిట్టేడులో జరిగిన కొమ్మ రాజశేఖర్‌ హత్య కేసులో ముద్దాయి అయిన అతని మామ రామయ్యను బుధవారం వాకాడు సీఐ సత్యనారాయణ అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ సమయంలో అతను విస్తుగొలిపే విషయాలను చెప్పాడు. ఈ సందర్భంగా కోట పోలీస్‌స్టేషన్‌ వద్ద ముద్దాయిని విలేకరుల ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈనెల 25వ తేదీ కొమ్మ రాజశేఖర్‌ను అతని మామ రామయ్య అతి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తన కూతురు నిరోషా రాజశేఖర్‌ను రెండు సంవత్సరాల క్రితం కులాం తర వివాహం చేసుకుని నాయుడుపేటలో కాపురముంటోంది. రామయ్య ఆమె వివాహాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

రాజశేఖర్‌ ఎప్పటికైనా చిట్టేడులో తల్లిదండ్రుల వద్దకు వస్తాడని, అతడిని అంతమొందించేందుకు వజ్జావారిపాళెంలో పొడవాటి పిడి గల కత్తిని తయారు చేయించి ఉంచాడు. ఈ నేపథ్యంలో 24వ తేదీ రాజశేఖర్‌ తన స్నేహితుడు రూపేష్‌ చనిపోవడంతో గ్రామానికి వచ్చిన విషయాన్ని రామయ్య తెలుసుకున్నాడు. ఉదయం నుంచే ఇంటి దగ్గర మాటు వేశాడు. స్నేహితుడి అంత్యక్రియల అనంతరం తన తల్లిని చూసేం దుకు రాజశేఖర్‌ ఇంటికి వచ్చాడు. బైక్‌ దిగుతున్న సమయంలోనే వెనుక నుంచి నరికాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన రాజశేఖర్‌ను రామయ్య తమ్ముడు వెంకటక్రిష్ణయ్య ఎదురువచ్చి పట్టుకోవడంతో 11 చోట్ల ఒంటిపై పొడచినట్లు సీఐ వెల్లడించారు. మరో ముద్దాయి వెంకటక్రిష్ణయ్య కోసం గాలిస్తున్నామన్నారు. అయితే కూతురు, అల్లుడు ఇద్దరు వచ్చి ఉంటే ఇద్దరినీ చంపేసేవాడినని నిందితుడు తెలిపినట్టు సీఐ చెప్పారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సై నారాయణరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement