ఆదోని టౌన్:తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి క్షణాల్లో చోరీకి పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగను ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి రూ. 135 గ్రాముల బంగారు, 50 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ ఇన్చార్జ్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, క్రైం పార్టీ పోలీసులు దొంగను గురువారం డీఎస్పీ అంకినీడు ప్రసాద్ సమక్షంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ మీడియాకు వివరించారు. ఆదోని పట్టణం సంతపేటకు చెందిన మెండు గుల్డి సునీల్కుమార్ అలియాస్ సురేష్గౌడు పట్టణంలోని శిల్పా సౌభాగ్యనగర్లోని తాయమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ధ్రువీకరించారు. అతని వద్ద దాదాపు రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
చోరీల వివరాలు
♦ ఆదోనిలోని ఎస్కేడీ కాలనీకి చెందిన రాజేశ్వరి ఇంట్లో పది గ్రాముల బంగారు గొలుసు, ఆల్ బ్యాంకర్స్ కాలనీకి చెందిన వ్యాసరాజు ఇంట్లో 20 గ్రాముల బంగారు చైను అపహరించాడు.
♦ ఆలూరు మండలం మణేకుర్తి గ్రామానికి చెందిన కురవ లక్ష్మి ఇంట్లో 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.
♦ ఆదోని పట్టణం కపర్తినగర్కు చెందిన డాక్టర్ అనిల్కుమర్ నివాసంలో 50 గ్రాముల బంగారు, 50 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించాడు.
ఒక్కడిపై 19 కేసులు
నిందితుడు సునీల్కుమార్ అలియాస్ సురేష్‡గౌడుపై ఆదోని టూటౌన్, త్రీ టౌన్, ఆలూరు స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు, బెంగళూరులో 8 కేసులు, గుంతకల్లో 5 కేసులు, హైదరాబాద్లో ఒక చోరీ కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. వేలిముద్రల ఆధారంగా ఆదోని, ఆలూరు పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో సునీల్కుమార్ నిందితుడి గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. చోరీ కేసులను ఛేదించిన సీఐ, ఎస్ఐలు, క్రైం పార్టీ పోలీసులకు రివార్డులను ప్రదానం చేశామన్నారు. ఉత్తమ అవార్డుల ప్రదానం కోసం జిల్లా ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ, ఎస్ఐలు రంగ, మస్తాన్వలి, నాగేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.