పిల్లలతో సహా గోదావరిలో దూకిన జర్నలిస్టు | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. పెను విషాదం

Published Sat, Jun 27 2020 7:55 AM

Journlist Commits Suicide With Two Children in East Godavari - Sakshi

సాయం సమయం బుజ్జాయిలూ బయటకు వెళ్దామా అంటే ఎగిరి గంతేశారు చక్కగా ముస్తాబయ్యారు స్కూటర్‌పైకి ఎక్కగానే ఎక్కడలేని సంతోషం అలా వెళ్తుంటే ఎదురొచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ
ముందుకు సాగిపోయారు వారధిపై చేరుకోగానే డాడీ ఎంత మంచాడోనంటూ ఆ చిన్నారుల మోముల్లో ఆనందహేల ఏమైందో...ఏమో అంతలోనే ఘోరం పిల్లలతోపాటు తండ్రీ తనువు చాలించాలని నిర్ణయం
అందరి ఇళ్లల్లో సాగే తంతే దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలే మనసు విప్పి మాట్లాడుకుంటే దూది పింజల్లా ఎగిరిపోయే సమస్యలే జర్నలిస్టుగా ఇలాంటివెన్నో చూసినా తన జీవితం దగ్గరకొచ్చేసరికి  
విషాదమే వెంటాడింది...(
గుండెల్లో గోడలు...)

తూర్పుగోదావరి, యానాం: చక్కగా సాగిపోతున్న ఆ కాపురంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి కీచులాటలు, వాదనలు, పట్టింపు ధోరణులతో కలతలు రేగాయి. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. వారు వెళ్లిన గంటల వ్యవధిలోనే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ భర్తను ఆత్మహత్యా యత్నానికి ప్రేరేపించింది. ఆ కుటుంబానికి పెను విషాదం మిగిల్చింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం, యానాంలో ప్రజాశక్తి దినపత్రిక విలేఖరిగా పని చేస్తున్న ముమ్మిడి శ్రీనివాస్‌(43)కు కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన లావణ్యకు 2014లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు హర్ష (5), హర్షిణి (5) కలిగారు. యానాం తోటవారి వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు స్థానికంగా ఓ ప్రైవేటు స్కూలులో చదువుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చాయి. వాటిని పెద్దల దృష్టికి తీసుకువెళ్లేవారు. భార్య సాధింపులు భరించలేక ఒక్కోసారి శ్రీనివాస్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి కొన్ని రోజులకు తిరిగి వచ్చేవాడు. గురువారం రాత్రి ఇద్దరి మధ్య కలహం తారస్థాయికి చేరడంతో పిల్లలతో కలిసి ఆ దంపతులు శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. (ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మైనర్‌కు వల)

శ్రీనివాస్, పిల్లల కోసం గాలిస్తున్న దృశ్యం
వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సహచర విలేకరులు సైతం సర్ది చెప్పి ఇంటి వద్ద దించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌ ఇంటి నుంచి బైక్‌పై ఇద్దరు పిల్లలతో కలిసి యానాం – ఎదుర్లంక బాలయోగి వారథి వద్దకు చేరుకున్నాడు. అనంతరం బైక్‌ను వదిలి తన ఇద్దరు పిల్లలతో కలిసి గౌతమీ గోదావరిలో దూకాడు. వారు బ్రిడ్జి పైనుంచి నదిలో దూకడాన్ని అమలాపురం వైపు వెళ్తున్న కొంతమంది చూసి, పోలీసులకు తెలిపారు. దీంతో సీఐ శివగణేష్, ఎస్సై రాము తదితరులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్‌ మీనా ఘటనా స్థలికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. గాలింపు చర్యలను పర్యవేక్షించారు. శ్రీనివాస్, ఆయన ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పర్యాటక, అగ్నిమాపకదళ బోట్లు, నావలతో సాయంత్రం 5 గంటల నుంచి గాలింపు చేపట్టారు. రాత్రి 7 గంటల వరకూ వారి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. శనివారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement