తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

Published Fri, Jul 26 2019 12:12 PM

Locked Houses Only Target For Thieves In Kazipet - Sakshi

సాక్షి, కాజీపేట : వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల ముఠా, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ డాక్టర్‌ రవీందర్‌ వివరాలను వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన గాజుల యోగేందర్‌ అలియాస్‌ యుగెందర్‌ అలియాస్‌ యోగి, కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన నూనె కిష్టమ్మ, శ్రీపాతి లింగమ్మలను అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 361 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, నాలుగు వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. 

జల్సాలకు అలవాటు పడి చోరీలు....
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యోగెందర్‌ కలర్‌ పేయింట్‌ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. చెడు వ్యసనాలకు బానిసై, సంపాదిస్తున్న డబ్బు జల్సాలకు 
సరిపోకపోవడంతో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడని కమిషనర్‌ తెలిపారు. 2012 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తిరుమలగిరి, అళ్వాల్‌ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. బయటికి వచ్చాక తన పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు.

అనంతరం వరంగల్‌కు మార్చిన యోగేందర్‌ చోరీలు చేస్తుండేవాడు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు, సుబేదారి, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కోక్క చోరీలకు పాల్పడ్డాడు. ఇంతేజార్‌గంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ డీ.శ్రీధర్‌ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ రై ల్వే స్టేషన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా తారసపడిన యోగేందర్‌ను విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.

నిందితుడి వద్ద నుంచి రూ.13.79లక్షల విలువైన 241 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 4 ల్యా ప్‌ట్యాప్‌లు, 4 వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకుని, నిందితుడి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. రెండు సంఘటనల్లో నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌.నాగరాజు, వరంగల్, కాజీపేట, ఏసీపీలు నర్సయ్య, నర్సింగరావు,పలువురు ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు.

Advertisement
Advertisement