ఒక ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం | Sakshi
Sakshi News home page

ఒక ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

Published Sun, Jul 15 2018 10:20 AM

Lorry Accident Nalgonda - Sakshi

కోదాడఅర్బన్‌ : లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా.. భయాందోళనతో ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ హఠాన్మరణం చెందాడు. ఈ వేర్వేరు ఘటనలు శనివారం కోదాడలో చోటుచేసుకున్నాయి. వివరాలు.. సూర్యాపేటకు చెందిన మయత్‌ రాజేందర్‌సింగ్‌(50) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన లారీని కిరాయి నిమిత్తం కోదాడకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో పట్టణంలోని సాలార్జంగ్‌పేట వద్దనున్న సర్వీసింగ్‌ సెంటర్‌లో లారీకి మరమ్మతులు చేయించుకున్నాడు. అతడు తన వాహనాన్ని రివర్స్‌ తీయడంతో రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో కోదాడ నుంచి సాలార్జంగ్‌పేటకు బైక్‌పై వెళుతున్న షేక్‌ ఆసిఫ్‌(25)ను ఆ లారీ వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆసిఫ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో లారీ డ్రైవర్‌ రాజేందర్‌సింగ్‌ తన వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు.  సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని  కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బస్టాండ్‌లో కుప్పకూలి..
భయపడిన లారీడ్రైవర్‌ రాజేందర్‌సింగ్‌ చాలాõపటికి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడే కుర్చీలో కూర్చుని ప్రమాద విషయంపై మరొకరితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కంట్రోలర్‌ నర్సిరెడ్డి అతడి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తున్నట్లు గమనించాడు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు, 108కు సమాచారం అందించడంతో వారు బస్టాండ్‌కు చేరుకున్నారు. అప్పటికే రాజేందర్‌సింగ్‌ మృతి చెందాడు.

దీంతో పోలీసులు అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైనలారీ డ్రైవర్‌ ఇతడేనని తెలి సింది. అతడి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. తన తండ్రికి గుండె సంబంధిత వ్యాధికి ఆపరేషన్లు జరిగినట్లు రాజేందర్‌సింగ్‌ కుమారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రమాద ఘటనపై ఆసిఫ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, రాజేందర్‌సింగ్‌ మృతిపై అతడి కుమారుడు ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ సైదాలు  కేసులు నమో దు చేశారు. ఒక ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

Advertisement
Advertisement