Sakshi News home page

ప్రేమవివాహం విషాదాంతం

Published Fri, Jul 20 2018 7:22 AM

Love Marriage Story San Ending In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: స్వామిమలై సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న మహిళ బుధవారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన బంధువులు, భర్త బంధువుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందులో మూడు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్‌కు చెందిన నీలమేఘం రైతు. ఇతని కుమార్తె అనసూయ (24). ఈమె బీటెక్‌ ముగించి ఇంట్లో ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు పుగళేంది పదో తరగతి చదువుకుని కేబుల్‌ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల కిందట ఇద్దరూ రహస్య వివాహం చేసుకుని వారి వారి ఇళ్లలో ఉంటున్నారు. ఈ స్థితిలో ఇద్దరూ కలిసి జీవించేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో పుగళేంది కుంభకోణం ముత్తం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు. ఇందులో తాను, అనసూయ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నట్లు, తామిద్దరూ కలిసి జీవించేందుకు చర్యలు చేపట్టాలని కోరాడు. దీనిపై పోలీసులు అనసూయ తండ్రి నీలమేఘంను పిలిచి విచారణ చేశారు. కుమార్తెకు వివాహం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన నీలమేఘం బంధువులతో కలిసి పుగళేంది, అతని బంధువులతో ఘర్షణ పడ్డాడు. ఘర్షణలో పుగళేంది బంధువులు సురేష్‌కుమార్‌ (36), సుందరి (28), అభిరామి (28) గాయపడి కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం కుమార్తెను తిట్టడంతో ఆమె ఆమె మనస్తాపం చెంది బుధవారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆవేశం చెందిన నీలమేఘం బంధువులు పుగళేంది, సహోదరులు సుమతి, గోమతి, బంధువులు వెళ్లైయమ్మాల్‌ ఇంటికి నిప్పు పెట్టారు. ఇందులో మూడు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement