చిత్తుకాగితాలు ఏరుకుంటూ.. | Sakshi
Sakshi News home page

చిత్తుకాగితాలు ఏరుకుంటూ.. చోరీలకు పాల్పడుతూ..

Published Fri, Apr 6 2018 1:27 PM

Man Arrest In Auto Mobile Shop Robbery Case - Sakshi

జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ఓ ఆటోమొబైల్‌ షాప్‌లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్ల డించారు. గత నెల 16న స్థానిక మునుసబు గారి వీధిలోని కోకిలా ఎంటర్‌ప్రైజెస్‌ ఆటోమొబైల్‌ షాపు తాళాలు పగులగొట్టి క్యాష్‌ కౌంటర్‌లోని రూ.4.50 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ కె.బాలరాజు, ఎస్సై జీజే విష్ణువర్దన్, క్రైం పార్టీ సిబ్బంది ఎన్‌.సంపత్‌కుమార్, రాజేంద్ర, మధు, రాజశేఖర్‌ ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ఐదేళ్లుగా స్థానిక వారపు సంతలో నివాసం ఉంటూ కాగితాలు, అట్టముక్కలు సేకరించే బోడేపల్లి శివాజీ ఈ చోరీ చేసినట్టు చెప్పారు.

అతడిది తణుకు పట్టణం అని, అక్కడి నుంచి వచ్చి స్థానిక వారపు సంతలో, ప్లాట్‌ఫారమ్‌పై నివసిస్తున్నట్టు చెప్పారు. వ్యసనాలకు అలవాటు పడిన శివాజీ గతేడాది ఆగస్టులో వేదాంతపురంలోని ఓ ఇంట్లో రూ.10 వేలు చోరీ చేశాడన్నారు. ఈ నేపథ్యంలో కోకిల ఎంటర్‌ప్రైజెస్‌లో చోరీకి పాల్పడ్డాడన్నారు. చోరీ చేసిన సొత్తులో కొంత వారపు సంతలో తాను నివాసముండే ప్రాంతంలో ఉంచి మరికొంత నగదును విజయవాడ, రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లి ఖర్చుచేశాడన్నారు. మిగిలిన సొమ్ము కోసం వారపు సంతలో తన నివాసం వద్దకు రాగా అతడిని అరెస్టు చేసి రూ.3.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, క్రైం పార్టీ సిబ్బందికి రివార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement