రైతును మింగిన అప్పు | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య చేసుకున్న యువరైతు

Published Sat, Jul 14 2018 10:59 AM

Man Committed Suicide In Medak - Sakshi

కోహీర్‌(జహీరాబాద్‌): అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సజ్జాపూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన రైతు విజేందర్‌ తన తండ్రి రామన్న పేరు మీద ఉన్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాక రూ. రూ. 4 లక్షల మేర అప్పులు చేశాడు.

గత రెండు నెలల క్రితం గ్రామంలో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని రూ. లక్షకు అమ్మి కొంత మేర అప్పులు తీర్చాడు. మిగతా అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భార్య పుష్పవతితో కలిసి పొలానికి వెళ్లాడు. అనంతరం నైలాన్‌తాడును కొంత మేర కత్తిరించుకొని ఇంటి వైపు బయలుదేరాడు.

అనుమానం వచ్చిన భార్య పని చేస్తున్న కూలి ఒకరికి తన భర్త విజేందర్‌ను అనుసరించమని చెప్పి పంపించింది. తాను కూడా ఇంటికి వచ్చింది. ఆ లోపే విజేందర్‌ ఇంటికి వచ్చి దూలానికి ఉరివేసుకున్నాడు. ఇరుగుపొరుగు సహాయంతో తాడు విప్పి కిందికి దింపి చూడగా అప్పటికే విజేందర్‌ చనిపోయాడు. మృతిడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement