విందులో విషాదం | Sakshi
Sakshi News home page

విందులో విషాదం

Published Thu, May 2 2019 12:58 PM

Man Died in Dinner Vizianagaram - Sakshi

సీతానగరం(పార్వతీపురం): మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు. ఓ విందుకు హాజరైన ఓ వ్యక్తి ఎంచక్కా సరదాగా డ్యాన్స్‌ చేసి అంతలోనే కుప్పకూలి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం గుచ్చిమిలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి విందు కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి స్టేజీపై డ్యాన్స్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. హైదరాబాద్‌ నగరం ఉప్పల్‌కు చెందిన కసిరెడ్డి అంజిబాబు(36) తన అన్నయ్య నాగేశ్వరరావుతో కలసి స్నేహితుడు గుచ్చిమికి చెంది సీహెచ్‌.అశోక్‌ ఇంట్లో వివాహవిందు కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం వచ్చారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో విందు ఆరగించి, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో ఊపిరాడక మృతిచెందారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కసిరెడ్డి అంజిబాబు బతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిపోయి ఉప్పల్‌లో సొంతంగా స్వగృహ స్వీట్‌షాపు నడుపుకుంటున్నాడనీ, తమ స్నేహితుడు అశోక్‌ చిన్నాన్న కుమారుడు అక్కేన ముకుందరావు పెళ్లి రిసెప్షన్‌ నిమిత్తం వచ్చామనీ, ఈ కార్యక్రమంలో డ్యాన్సు చేస్తుండగా రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో తమ్ముడు అంజబాబు ఒకసారిగా కుప్పకూలి కింద పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కారులో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించామనీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. బుధవారం ఉదయం  సీతానగరం పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలియ జేసారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఎస్‌ క్రిష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియ జేశారు.

Advertisement
Advertisement