కుటుంబాన్ని రక్షించబోయి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 8:11 AM

Man Dies While Rescuing His Family Drown In Water At Marina Beach - Sakshi

సాక్షి, హసన్‌పర్తి: విహార యాత్రలో విషాదం అలుముకుంది. చెన్నైలోని మెరినో బీచ్‌లో నీటి అలలకు వరంగల్‌ నగరానికి చెందిన పాలకుర్తి సురేష్‌(44) కొట్టుకుపోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విహార యాత్ర నిమిత్తం వారం రోజుల క్రితం సురేష్‌ కుటుంబంతోపాటు మరో రెండు కుటుంబాల సభ్యులు చెన్నైలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. చివరిగా రామేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి శుక్రవారం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు.

రైలు ఆలస్యం ఉండడంతో సమీపంలోని మెరినో బీచ్‌కు వెళ్లారు. అందరూ స్నానం చేసే క్రమంలో అలలు ఎగిసి పడి సురేష్‌ భార్య మాధవి, కుమారుడు సాత్విక్, కూతురు శ్రీజ నీటిలో మునిగిపోతుండగా వారిని రక్షించడానికి సురేష్‌ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు నీటిలో కొట్టుకుపోయినట్లు బంధువులు తెలిపారు. పదినిమిషాల తర్వాత సురేష్‌ మృతదేహాం ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు అక్కడక్కడే కుప్పకూలిపోయారు.

రామన్నపేటలో అద్దె ఇంట్లో నివాసం..
సురేష్‌ కుటుంబం నగరంలోని రామన్నపేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల అతడు హసన్‌పర్తిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడు. రామన్నపేటలో ఉంటూ హన్మకొండలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. సురేష్‌ అంత్యక్రియలు ఆదివారం హసన్‌పర్తిలోని ఆర్యవైశ్య శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. 

Advertisement
Advertisement