శోభనాన్ని అడ్డుకున్నాడని కన్న తండ్రిని.. | Sakshi
Sakshi News home page

శోభనాన్ని అడ్డుకున్నాడని తండ్రి హత్య

Published Mon, Jun 17 2019 7:07 AM

Man Kills Father In T Nagar Chennai - Sakshi

టీ.నగర్‌ : శోభనానికి అడ్డుకున్నాడని ఓ వరుడు కన్న తండ్రినే హతమార్చిన సంఘటన శనివారం అరియలూరు జిల్లాలో చోటు చేసుకుంది. అరియలూరు జిల్లా జయంకొండం సమీపాన గల ఆదిచ్చనల్లూరు గ్రామానికి చెందిన షణ్ముగం(48) కుమారుడు ఇళమది (23). ఇతనికి శుక్రవారం వివాహం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో బంధువులందరూ వెళ్లిపోయారు. వరుడి కుటుంబసభ్యులు కొంత మంది బంధువులు ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో షణ్ముగం కుమారుడు ఇళమదిని రమ్మన్నాడు. పెళ్లి ఖర్చు లెక్కలు చూడాలని, చదివింపు నగదు ఏ మేరకు వచ్చిందని, పోయి నగదు తీసుకురమ్మని చెప్పారు. ఆ సమయంలో ఇళమది మొదటి రాత్రికి సిద్ధమవుతున్నాడు. వధువు శోభనపు గదికి వెళ్లింది. ఇదిలా ఉండగా, తండ్రి షణ్ముగం తనకు లెక్కలు చూపి శోభనపు గదిలోని వెళ్లాలని కొడుకు ఇళమదిని మందలించాడు. అందుకు ఇళమది ఉదయాన్నే చూసుకుందామని చెప్పడంతో తండ్రి ఒప్పుకోకుండా ఇప్పుడే చూపాలని పట్టుబట్టాడు.

దీంతో ఇళమది తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తండ్రి అక్కడ ఉన్న దుడ్డుకర్రను తీసుకుని కొడుకుపై దాడికి ప్రయత్నించాడు. అయితే, ఆగ్రహించిన కొడుకు ఇళమది తండ్రి నుంచి లాక్కుని దాంతోనే అతని తలపై మోదాడు. దీంతో అతను కిందపడిపోయి స్పృహతప్పాడు. వెంటనే అక్కడి వారు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా, అక్కడికి వచ్చిన అంబులెన్స్‌ వైద్య సిబ్బంది పరీక్షించగా అతను మృతి చెందినట్టు తెలిసింది. దీంతో పెళ్లి ఇంట పారణి ఆరక ముందే శోకవాతావరణం నెలకొంది. దీని గురించి షణ్ముగం తమ్ముడు అన్నాదురై ఉడయార్‌పాళయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇళమదిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement