పెళ్లికి అంగీకరించలేదని యువతిపై దాడి | Sakshi
Sakshi News home page

పెళ్లికి అంగీకరించలేదని యువతిపై దాడి

Published Wed, May 30 2018 9:19 AM

Man Knife Attack On Woman In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: పెళ్లికి అంగీకరించలేదని యువతిపై కత్తితో యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన విరుదాచలంలో సోమవారం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా ఉళుందూర్‌పేటనగర్‌కి చెందిన అశోకన్‌. ఇతని కుమార్తె అసోనా (21). ఆమె ఇంజినీరింగ్‌ చేసి విరుదాచలంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈమె సోమవారం ఉదయం స్నేహితురాలితో కలిసి ఉళుందూర్‌పేట నుంచి బస్సులో విరుదాచలం బస్టాండ్‌కి వచ్చింది. తరువాత ఆమె అక్కడ నుంచి పని చేసే కార్యాలయం వైపు స్నేహితులతో కలిసి నడిచి వెళుతోంది. సరోజని నాయుడు వీధిలో నడిచి వెళుతుండగా ముసుగు ధరించి బైకులో వచ్చిన వ్యక్తి అసోనాపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో గాయపడ్డ అసోనాని స్థానికులు విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

అసోనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు విరుదాచలం పోలీసులు విచారణ చేశారు. విచారణలో అసోనా రెండేళ్లకు ముందు కళ్లకురిచ్చి సమీపం కొంగరాయపాలయంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడ  విజయ్‌తో (24) పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరికి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో విజయ్‌ ప్రవర్తన సరిగాలేదని అసోనా, అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అప్పటి నుంచి అసోనా విజయ్‌తో మాట్లాడకపోవడంతో ఆమెను హత్య చేసేందుకు యత్నించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అసోనా ప్రాణాలతో ఉందా లేదా మృతి చెందిందా అని చూడడానికి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి బైకులో వచ్చిన విజయ్‌ని కొళంజియప్పర్‌ ఆలయ సమీపంలో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement