వ్యక్తి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Published Fri, Mar 2 2018 1:10 PM

Man suicide in mango garden Suspicious - Sakshi

శ్రీకాకుళం, మందస: మండలంలోని అంబుగాం పంచాయతీ చిన్నలింబుగాం గ్రామానికి చెందిన వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ యజమాని పులారి తులసి(36) అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి.. రాత్రికి చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం కాశీబుగ్గలో ఉన్నానని చెప్పిన ఆయన.. అంతలోనే విగత జీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మండలంలోని చిన్నలింబుగాం గ్రామానికి చెందిన తులసి.. గుజరాత్‌లోని గాంధీగ్రాం ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నారు. అక్కడి నుంచి మళ్లీ స్వగ్రామానికి వచ్చి.. హరిపురంలోని రట్టి రోడ్డు జంక్షన్‌ సమీపంలో వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ను  నిర్వహిస్తున్నారు. జేసీబీ, ట్రాక్టర్‌ను అద్దెకు ఇస్తూ జీవిస్తున్నారు. ఆయనకు భార్య భానుమతి, కుమారుడు హరీష్, కుమార్తె సంధ్య ఉన్నారు. రోజూ ఇంటి వద్ద నుంచి హరిపురం వెళ్లి వస్తున్నారు.

బుధవారం యధావిధిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొంత సమయం తర్వాత భార్య భానుమతి ఫోన్‌ చేయగా.. కాశీబుగ్గలో ఉన్నానని తులసి చెప్పారు. రాత్రి సమయంలో ఫోన్‌ చేసినా ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. అంబుగాం నుంచి చిన్నలింబుగాంనకు వెళ్లేదారిలోని తోటల్లో ఓ మామిడిచెట్టుకు  ఉరి వేసుకుని కనిపించడంతో వీరంతా హతాశులయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి సోంపేట సీఐ సన్యాసినాయుడు, మందస ఎస్‌ఐ యర్ర రవికిరణ్‌ చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగాయి. డాగ్స్‌ మాత్రం అంబుగాం బస్‌షెల్టర్‌ వరకు వచ్చి వెనుతిరిగాయి. మృతదేహాన్ని బారువా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తులసి మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. తులసికి ఎవరితోనూ వివాదాలు లేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మామిడిచెట్టుకు ఎత్తుగా వేలాడుతుండడం.. సంఘటనా స్థలంలోనే ఓ చిన్న చాకు పడి ఉండడం.. మృతదేహంపై రక్తపు మరకలుగానీ, గాయాలు గానీ లేకపోవడంతో అందరిలోనూ మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement