మాడుగుల: అప్పటివరకు పెళ్లింట భర్తతో సరదాగా గడిపి స్కూటీపై తిరిగి వస్తున్న ఆమెను మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. మండలంలో వీరనారాయణ, గాదిరాయి రోడ్డు ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. రావికమతం మండలం బుడ్డిబంద గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గోళ్ల వరహాలుదొర అదే మండలం చినపాచిలలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇటీవల చింతల అగ్రహారం హైస్కూల్కు బదిలీ అయింది. పెందుర్తిలో నివాసం ఉంటూ ప్రతిరోజూ చింతల అగ్రహారం హైస్కూల్కు వచ్చి వెళ్తున్నారు. ఆదివారం కావడంతో పిల్లలను తమ్ముడి వద్ద ఉంచి భార్య గౌరీకుమారీతో కలసి మాడుగుల మండలం రావిపాలెంలో బంధువుల పెళ్లికి వచ్చారు.
భార్యాభర్తలు బంధువులతో సరదాగా గడిపారు. భోజనం అనంతరం రావిపాలెం నుంచి పెందుర్తికి వీరనారాయణం రోడ్డులో స్కూటీపై బయలుదేరారు. వడ్డాది నుంచి మెటల్ లోడుతో వస్తున్న టిప్పర్ వారి స్కూటీని ఢీకొంది. తీవ్రగాయాలైన గౌరీ కుమారి (25) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. వరహాలుదొరకు స్వల్ప గాయాలయ్యాయి. భార్య మృతిని తట్టుకోలేక భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి బంధువులకు సమాచారం అందించారు. కళ్లముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో వరహాలుదొర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఎస్ఐ ధనుంజయ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గౌరీ కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.
సేవలు మరువలేనివి
మృతురాలు గౌరీ కుమారి సేవలు మరువలేని వని వైఎస్సార్సీపీ నాయకుడు దాసరి వరహాలు, తదితరులు పేర్కొన్నారు. రావికమతం మండలం కొమిర స్థానానికి 2014లో వైఎస్సార్సీపీ తరఫున గౌరీ కుమారి పోటీ చేశారు. భర్త ఉద్యోగ రీత్యా వెళ్లిపోయినప్పటికీ ఆమె స్వ గ్రామం బుడ్డిమందలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందించారు. ఆమె మరణవార్తను తెలుసుకున్న వారంతా కన్నీటి పర్యం తమయ్యారు. చీడికాడ మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నేత సలుగు సత్యనారాయణ, తదితర నాయకులు సంఘటన స్థలానికి వచ్చి భర్త వరహాలుదొర, కుటుంబ సభ్యులను ఓదార్చారు.