మురుగుకాలువలో పడి మర్చంట్‌ నేవీ ఉద్యోగి మృతి | Sakshi
Sakshi News home page

మురుగుకాలువలో పడి మర్చంట్‌ నేవీ ఉద్యోగి మృతి

Published Thu, May 31 2018 1:38 PM

The merchant navy employee died in a canal - Sakshi

కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు ఉదయపురం చాకలివీధికి చెందిన మార్కండేయ కిరణ్‌కుమార్‌ (32) మంగళవారం అర్ధరాత్రి సుమారు 8 అడుగుల లోతైన మురుగుకాలువలో పడి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిరణ్‌కుమార్‌ నందిగాం మండలం బడగాంలో జరిగిన గ్రామదేవత సంబరాలకు వెళ్లి మంగళవారం అర్ధరాత్రి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు.

పలాస ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద  బైకుతో సహా మురుగుకాలువ(డ్రైనేజీ)లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం వేకువజామున మూడుగంటలకు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసు సిబ్బం దికి సమాచారం అందడంతో ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శవపంచనామా అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహమైన తొమ్మిది నెలలకే.. 

సంబరాల నుంచి తిరిగి వచ్చేస్తున్నాని చెప్పిన కిరణ్‌ ఇంతలోనే మృతి చెందడంతో భార్య శైలజ కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. వీరికి గత ఏడాది అక్టోబరులో వివాహమైంది. తల్లి గృహిణికాగా, సోదరికి వివాహమై బెంగళూరులో నివాసముంటోంది. తండ్రి మార్కండేయ త్రినాథ్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసి ప్రస్తుతం పలాసలో మాజీ సైనిక సంఘానికి ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నారు.

Advertisement
Advertisement