రావికమతం(చోడవరం):మండలంలో గర్నికం గ్రామంలో బీఎన్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ ఇంటిలో మంగళవారం పట్టపగలు చోరీ జరిగింది. రూ.60 వేల నగదు, 60 తులాల వెండి, 15 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని గల ఇంటిలో బొల్లా ప్రగడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఓ ప్రైవేట్ డెయిరీలో ఉద్యోగం చేస్తుండగా, అతని భార్య రమాదేవి స్థానిక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సుబ్రహ్మణ్యం తల్లి, అతని చిన్న కుమార్తె విశాఖ పండుగకు వెళ్లగా, పెద్ద కుమార్తె అనకాపల్లి కాలేజీకి వెళ్లి, సోమవారం చిట్టెయ్యపాలెంలో బంధువుల ఇంటివద్ద ఉండిపోయింది. దీంతో భార్య భర్తలిద్దవురూ తలుపులు వేసుకుని ఉదయం 10 గంటలకు డ్యూటీలకు వెళ్లారు.
మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఇంటికి రాగా, ఇనుప గేట్లుకు, లోపలి గేట్లకు వేసిన తాళాలు తెరిచి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా గెడ విరిగి, తలుపు తెరిచి ఉండడంతో పాటు దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగినట్టుగా తెలుసుకుని లబోదిబోమంటూ రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తామిద్దరం ఉద్యోగం చేస్తూ కష్టపడి సంపాదించి పొదుపుగా జీవనం సాగిస్తున్నామని, ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్ల కోసం ఒకొక్కటిగా బంగా రు ఆభరణాలు సమకూర్చుకున్నామని, వివాహ సమయంలో ఒక్కసారిగా కొనలేమన్న ఉద్దేశంతో వెండి ఆభరణాలు కొనుగోలు చేసి, వేర్వేరు బీరువాల్లో భద్రపరిచామని, దొంగలు దోచుకోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని రోదిస్తూ వారు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి, బాగా తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. రావికమతం ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి రెండు బృందాల క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించాయి.