తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

తండ్రి వ్యసనాలు మానుకోవడం లేదని..

Published Tue, Aug 27 2019 12:37 PM

Minor Girl Commits Suicide in Prakasam - Sakshi

ప్రకాశం ,పర్చూరు: మద్యానికి బానిసైన తండ్రి ఎంత చెప్పినా మారక పోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మైనర్టీ తీరని కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నూతలపాడులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రంగనాథ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్‌ కుంచాల పౌలేశ్వరి (15) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌలేశ్వరి రెండు రోజుల క్రితం తన తండ్రి కుంచాల సుబ్బారావుతో మాట్లాడింది. ఇక నుంచి మద్యం తాగొద్దని, తనకు పెళ్లి ఈడు వస్తోందని, తనను పట్టించుకోవాలని కోరింది. అయినా సుబ్బారావు మద్యం తాగి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక తాను ఉంటున్న తాత, నాయనమ్మల ఇంట్లోని దులానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్బారావు దంపతులు 14 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పౌలేశ్వరి తండ్రి వద్ద ఉంటోంది. చిన్న కుమార్తె తల్లి పాపమ్మ వద్ద దుద్దుకూరులోని ఆమె పుట్టింట్లో ఉంటోంది. తండ్రి బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుమార్తె పలుమార్లు మానుకోమని హెచ్చరించినా మారలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెంది పెద్ద కుమార్తె పౌలేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగనాథ్‌ తెలిపారు.

Advertisement
Advertisement