ప్రియుడితో కలిసి భర్త హత్య | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్త హత్య

Published Fri, Jun 8 2018 9:58 AM

Missing Case Reveals Wife Killed Husband In Anantapur - Sakshi

కళ్యాణదుర్గం: వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భావించిన మహిళ ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తనే మట్టుపెట్టిన సంఘటన బయటపడింది. మృతుని భార్య మేకల సరోజమ్మ, ఆమెకు సహకరించిన పాలవాయి గ్రామానికి చెందిన రామాంజినేయులు, మరో వ్యక్తి బుధవారం పాలవాయి వీఆర్వో వన్నప్ప దగ్గర లొంగిపోయారు. డీఎస్పీ మల్లికార్జున ఆదేశాల మేరకు సీఐ శివప్రసాద్, రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గురువారం విలేకరులకు తెలిపారు. ఆ మేరకు... పాలవాయి గ్రామానికి చెందిన పెద్ద లింగమయ్య, భార్య సరోజమ్మ వ్యవసాయ పనులు చేసుకునేవారు. అయితే సరోజమ్మ అదే గ్రామానికి చెందిన రామాంజినేయులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కళ్లారా చూసిన భర్త పెద్ద లింగమయ్య పలుమార్లు మందలిస్తూ గొడవ పడేవారు. సరోజమ్మ ఈ విషయాన్ని రామాంజినేయులుకు చెప్పుకొని బాధపడేది. ఈ క్రమంలో వారిద్దరూ పెద్ద లింగమయ్యను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు.

అందులో భాగంగా 2017 అక్టోబర్‌ 5వ తేదీ బోయ తలారి చెన్నప్ప పొలంలో పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అక్కడ లింగమయ్య కళ్ళల్లో కారం కొట్టి తలపై, భుజంపై కొడవలితో నరికారు. ఆయన కింద పడిపోగానే తలపై బండరాయితో బాదారు. గొంతు మీద కాలేసి తొక్కి ప్రాణం తీశారు. పక్కనే ఉన్న మట్టి కాలువ దగ్గర మృతదేహాన్ని పూడ్చివేశారు. మృతుని తండ్రి మేకల సన్నతిమ్మప్ప 2017 నవంబర్‌ 9న తన కుమారుడు కనిపించలేదని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement