రెండింతలు చేసిస్తా‘మనీ’.. | Sakshi
Sakshi News home page

రెండింతలు చేసిస్తా‘మనీ’..

Published Wed, Feb 12 2020 11:29 AM

Money Fraud to School Teacher in Tamil nadu - Sakshi

చెన్నై, అన్నానగర్‌: పోరూర్‌ సమీపంలో నగదు రెండింతలుగా చేసి ఇస్తామని చెప్పి ఉపాధ్యాయురాలి వద్ద రూ.12 లక్షలు మోసం చేసిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై కొలత్తూర్‌ అన్నపూర్ణా నగర్‌ 3వ వీధికి చెందిన శివాజీ భార్య శ్రీప్రియ. పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె మంగళవారం వడపళణి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో తాను టైలర్స్‌ రోడ్డులో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానని, తనతో పనిచేసే మరో ఉపాధ్యాయురాలి ద్వారా వడపళణి అళగిరి నగర్‌ మెయిన్‌ రోడ్డులో కార్యాలయం నడుపుతూ వచ్చి శివకుమార్, వనిత, ప్రభాకర్‌ గత ఏడాది తనకు పరిచయమయ్యారని తెలిపింది.

ఆ ముగ్గురూ తమ సంస్థలో రూ.50 వేల నగదు పెట్టుబడి పెడితే రోజూ రూ.410 చొప్పున 200 రోజులుకి నగదు బ్యాంక్‌లో జమచేస్తామని చెప్పారని తెలిపింది. దీన్ని నమ్మి గత ఏడాది మే 7వ తేదీ రూ.2 లక్షల నగదు, ఆన్‌లైన్‌ ద్వారా మరో రూ.10 లక్షలు ఇచ్చానని, మొదటి నెల వారు చెప్పిన ప్రకారం రూ.1 లక్ష 25 వేలు తన బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యిందని తెలిపింది. ఆ తరువాత నగదు ఏమీ రాలేదని, దీనిపై శివకుమార్‌కి కాల్‌ చేస్తే అది పనిచేయలేదని పేర్కొంది. కార్యాలయం కూడా మూసివేసి ఉందని తెలిపింది. తనకు రావాల్సిన రూ. 12 లక్షల నగదుని మోసం చేసి శివకుమార్, వనిత, ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement