చెల్లెలి వివాహం కోసం.. | Sakshi
Sakshi News home page

యజమానికే టోకరా

Published Wed, Aug 1 2018 8:44 AM

Money Robbery For Sister Marriage In Hyderabad - Sakshi

బోడుప్పల్‌: చెల్లెలి పెళ్లి చేసేందుకు యజమానిని బురిడీ కొట్టించి రూ.13లక్షల నగదు  చోరీ చేసిన యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు.బోయినపల్లికి చెందిన ప్రణవ్‌ అగర్వాల్‌ స్టీల్‌ వ్యాపారం చేసేవాడు. నగరంలోని పలు షాపులకు స్టీల్‌ సరఫరా చేస్తాడు.  షాపుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా, మక్తల్‌కు చెందిన చిట్యాల నర్సింహ్మను కలెక్షన్‌ బాయ్‌గా నియమించుకున్నాడు. కుషాయిగూడలో ఉంటూ గత ఏడేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న అతడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. డబ్బులు లేక చెల్లికి పెళ్లి చేయలేకపోయాడు.

ఈ క్రమంలో సోమ వారం నర్సింహ్మ బోడుప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో వసూలు చేసిన నగదు రూ.13లక్షలు తీసుకుని వస్తున్నాడు. మధ్యాహ్నం 12.30 గంట ల ప్రాంతంలో శ్రీసాయినగర్‌ కాలనీ వద్ద  మూత్ర విసర్జన చేస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తు లు తన వద్ద ఉన్న బ్యాగ్‌ను తీసుకుని పారిపోయినట్లు యజమానికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ప్రణవ్‌ అగర్వాల్‌ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సింహ్మ మాటలపై అనుమానం రావడంతో  మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తన చెల్లెలి పెళ్లి చేసేందుకే దొంగతనం నాటకం ఆడిన ట్లు తెలిపాడు. అతడి నుంచి రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును 24గంటల్లో ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, డిఐ దేవేందర్, పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినందించారు.  కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement