రోడ్డు ప్రమాదంలో తల్లి గాయపడటంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చిన కుమారుడు ఆమెకు జ్యూస్ తీసుకెళదామని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మరణించాడు. తల్లి ఆసుపత్రిలో బెడ్ మీద ఉండగా, కుమారుడి మృతదేహం మార్చురీలో ఉన్న హృదయ విదారక ఘటన ఇది..
తణుకు: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టటంతో వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని బస్టాండు సమీపంలో మూసివేసిన రైల్వేగేటు ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తిలికి చెందిన కూసంపూడి అయ్యప్ప అలియాస్ మణికంఠ (35) తల్లి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను తణుకు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని డాక్టర్లు రిఫర్ చేశారు.
ఈక్రమంలో మణికంఠ తన మిత్రుడితో కలిసి రైల్వే గేటు వద్దకు చేరుకున్నాడు. తన తల్లి కోసమని జ్యూస్ తీసుకుని వస్తానని అతను రాజమండ్రి నుంచి భీమవరం వెళుతున్న రైలును గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. దీంతో రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అదే రైలులో తణుకు రైల్వే స్టేషన్కు తరలించిన రైలు పైలట్ 108కు సమాచారం అందించాడు. అప్పటికే అతను మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మణికంఠ తాపీమేస్త్రి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు భీమవరం రైల్వే ఎస్సై ఏవీ ప్రసాదరావు కేసు దర్యాప్తు చేపట్టారు.