‘పోల్’మార్టం..!
వివరాలు 8లో uలోక్సభ ఎన్నికల సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల మల్లగుల్లాలు
● గత ఎన్నికలతో పోలిస్తేమహబూబ్నగర్లో 7.12 శాతం,నాగర్కర్నూల్లో 7.23 శాతం పెరిగిన ఓటింగ్
● ముఖ్య అనుచరులతో కలిసిబూత్ల వారీగా మంతనాలు
● క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్పై క్షేత్రస్థాయిలో ఆరా
● గెలుపోటములపై ఎవరి లెక్కలు వారివే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్ల శాతాన్ని బట్టి ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలించి తమకు వచ్చిన ఓట్ల శాతం ఎంత అనేది అంచనా వేసుకుంటున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 72.43 శాతం ఓటింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 7.12 శాతం మేర ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ఏ పార్టీకి నష్టం వాటిల్లనుంది, ఏ పార్టీకి ఎవరికి లాభం చేకూరనుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనుండటం, ఇందుకు దాదాపు మూడు వారాల సమయం ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
జడ్చర్లలో అత్యధికం..
మహబూబ్నగర్లో అత్యల్పం..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే జడ్చర్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 77.92 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 77.40 శాతం ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 66.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లలో 8,32,256 మంది పురుషులు, 8,50,172 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 17,916 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 6,12,924 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా 73.65 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 71.24 శాతంతో మహిళా ఓటర్లు 6,05,647 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 2,44,525 మంది మహిళా ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
గతానికి మించి భారీగా పెరిగిన ఓటింగ్..
గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగి, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తగ్గుతూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం గత పార్లమెంట్ ఎన్నికల కంటే 7.12 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. 2004 లోక్సభ ఎన్నికల్లో 63.46 శాతం, 2009లో 67.68 శాతం, 2014లో 72.94 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 65.31 శాతం పోలింగ్ కాగా, తాజాగా 72.43 శాతం ఓటింగ్ నమోదైంది.