సాక్షి, అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకట వేణుధర ప్రసాద్గా గుర్తించారు. అతడిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ప్రసాద్ మరో ముగ్గురితో ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో మాయమాటలు చెప్పి డాక్టర్ రామకృష్ణంరాజు నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా తెలిపారు.
రైస్ పుల్లింగ్ పాత్రలతో సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతాయని ఈ ముఠా డాక్టర్ను నమ్మించి మోసం చేసిందని వివరించారు. రామకృష్ణంరాజు కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ప్రసాద్ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మిగతా ముగ్గురు నిందితులు అనంత రాములు, షావలిన్, శ్రీనివాస్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే సూసైడ్ నోట్ను పోలీసులు ఇప్పటివరకు బయటపెట్టలేదు. (చదవండి: ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది)