తెల్లవార్లూ బంధించి భార్యపై కానిస్టేబుల్‌ దాడి! | Sakshi
Sakshi News home page

భార్యపై కానిస్టేబుల్‌ దాడి!

Published Thu, Jan 23 2020 11:21 AM

Police Constable Assult on Wife in Anantapur - Sakshi

అనంతపురం సెంట్రల్‌: పోలీసు కానిస్టేబుల్‌ తన భార్యపై దాడి చేశాడనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ కళ్యాణదుర్గం బైపాస్‌ రోడ్డులో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తెల్లవార్లూ ఓ గదిలో బంధించి విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు గాయపడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఘటనపై ఎక్కడా ఫిర్యాదు రాలేదు. దీనిపై అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని వివరణ కోరగా ఎక్కడ జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.  ఏం జరిగిందో ఆరా తీయాలని ట్రాఫిక్‌ డీఎస్పీని కోరినట్లు వెల్లడించారు.

కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ ఇస్తాం
ఈ అంశంపై ట్రాఫిక్‌ డీఎస్పీ మున్వర్‌హుస్సేన్‌ మాట్లాడుతూ సదరు కానిస్టేబుల్‌ గత ఏడాది జులై నుంచి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నారన్నారు. ఇతనికి రెండు సంవత్సరాల క్రితం వివాహమైందని, రెండు నెలల క్రితం కుమార్తె పుట్టిందని తెలిపారు. అయితే తనను మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మొర పెట్టుకుందన్నారు. కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.    

Advertisement
Advertisement