నా కొడుకును ఎలా చంపినా పర్లేదు | Sakshi
Sakshi News home page

నా కొడుకుకు ఉరిశిక్ష వేసినా ఫర్వాలేదు: చెన్నకేశవులు తల్లి

Published Sat, Nov 30 2019 11:24 AM

Priyanka Reddy Murder Case Accused Chennakeshavulu Mother Says Hang Him - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ప్రియాంకను ఎలా చంపారో.. తన కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదని ప్రియాంకారెడ్డి హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాకు తెలిపారు. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్‌ ఆరిఫ్‌ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్‌ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రియాంకను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ ’సాక్షి’తో మాట్లాడారు. ’నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు. లవ్‌ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. వాడికి కిడ్నీ పాడైంది. జక్లేర్‌ వ్యక్తి(మహ్మద్‌ ఆరిఫ్)తో స్నేహం చేసిన తర్వాతే పాడైపోయాడు. లారీ లోడ్‌ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరికీ ఒకటే బాధ. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్‌! 

నా కొడుకు అలాంటివాడు కాదు: ఆరిఫ్ తల్లి

అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు​​​​​​​

28 నిమిషాల్లోనే చంపేశారు!​​​​​​​

Advertisement
Advertisement