Sakshi News home page

‘ఆమె’కు రక్ష!  

Published Mon, May 14 2018 12:12 PM

For the protection of women - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : జిల్లాలో మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆకతాయిల ఆట కట్టించడానికి జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన షీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈవ్‌టీజింగ్‌ లేదా వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహి ళలు తమ ఆవేదనను వాట్సాప్‌ ద్వారా చెప్పినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

ఇందుకోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సామాజిక మాధ్యమాలను, వాట్సాప్‌ నంబర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కొందరు బాధితులు తల్లిదండ్రులకు చెప్పుకోలేని స్థితిలో ఉండటం, పోలీసులకు చెప్తే వివరాలు సైతం బహిర్గతం అవుతాయన్న భయం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో వాట్సాప్‌కు పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే బృందం స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు షీటీం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 2017లో 12 ఎఫ్‌ఐఆర్‌లు, 76 కేసులలో 151 మంది యువకులకు కౌన్సిలింగ్‌ చేశారు. 2018 జనవరి నుంచి మే 13 వరకు 43 కేసులలో 69 మంది యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. 

చైతన్యం చేసేందుకు కృషి.. 

షీటీంల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎస్పీ షీటీంల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్, వేధింపుల వంటి సమస్యలు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని సెల్‌ నంబర్లు ఇస్తున్నారు. 100కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. 

మండల కేంద్రాల్లో సైతం.. 

జిల్లాకేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో సైతం ఈవ్‌టీజింగ్, వేధింపులు క్రమంగా పెరుగుతున్నా యి. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న భావనతో బాధితులు వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. చట్టం వీరికి రక్షణగా ఉన్నా పోలీసులంటే భయం కారణంగా వారికి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో అవగహన కార్యక్రమాలు ఏర్పా టు చేసిన తర్వాత కొంత మార్పు వచ్చింది.

సెల్‌ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదరువుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీ టీం అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్‌బుక్‌లో వెల్లువలా వచ్చే పోస్టింగ్‌లకు లైక్‌ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెసేజ్‌లు చేసే వరకూ రావడం పలు కేసుల్లో గుర్తిం చారు.

ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు బ్లా క్‌మెయిలింగ్‌కు దిగుతున్న ఘటనలూ కోకొల్లలు. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీటీంను ఆశ్రయించడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, వేర్వేరు నంబర్ల నుంచి వరుసగా కాల్స్‌ రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్‌ చేయడం మాట్లాడేప్పుడు పెట్టే యడం..

కొన్నిసార్లు అసభ్యంగా మాటలు.. వంద ల సంఖ్యలో పట్టణంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేదన ఇది. పాత నంబర్‌ తీసేసి కొత్త ఫోన్‌ నంబర్‌ తీసుకున్నా మందికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలాంటి వారి సమస్య పరిష్కరించేందుకు షీటీంలు పని చేస్తున్నాయి.

అర్ధరాత్రి వరకూ వేధింపులు.. 

వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ చేస్తున్న వారిని పట్టుకునేందుకు షీటీంలు పనిచేస్తున్నా సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌ ఆధారిత నేరాలకు పాల్పడేవారు విద్యార్థినులు, యువతులను ఇంకా వేధిస్తూనే ఉన్నారు. తెలిసిన వారున్నా లేకపోయినా సెల్‌ఫోన్‌ నంబరుంటే చాలు అసభ్యంగా మాట్లా డుతుంటారు. బాధితులు మాట్లాడకపోయినా, నంబరు గుర్తించి సమాధానం ఇవ్వకపోయిన వేర్వేరు నంబర్లతో ఫోన్‌ చేసి భయపెడుతున్నారు.

పైశాచిక మనస్త త్వం ఉన్న కొందరు నేరగాళ్లు దుర్భాషలాడుతున్నారు. ఆసభ్య, అశ్లీల వీడియోలను సెల్‌ఫోన్‌లకు పంపుతున్నారు. మరికొందరు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు విరామం లేకుండా ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఇలాంటి చిత్రహింసలు ఎదుర్కొంటున్న వారి లో కొంతమంది వైద్యులూ, ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగినులు ఉన్నారు.

కళాజాత బృందాలతో అవగాహన 

జిల్లాలో షీటీం పనితీరుపై గ్రామాల్లో పోలీస్‌ కళాజాత బృందాలతో చైతన్యం చేస్తున్నాం. అలాగే కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వేధింపులకు ఎదుర్కొంటున్న వారు  ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వేధించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మహబూబ్‌నగర్‌ బస్టాండ్, కళాశాలలు, కళాశాలలకు వెళ్లే రోడ్లపై షీటీంలు ఉంటాయి. – సంపత్, షీటీం సీఐ, మహబూబ్‌నగర్‌

Advertisement

What’s your opinion

Advertisement