రోడ్డు ప్రమాదంలో  కానిస్టేబుల్‌ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో  కానిస్టేబుల్‌ మృతి

Published Mon, Jun 4 2018 8:18 AM

Road Accident In Warangal - Sakshi

బూర్గంపాడు : గోదావరి బ్రిడ్జిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరి బ్రిడ్జిపై ఎదురెదురుగా రెండు మోటార్‌ సైకిళ్లు వేగంగా ఢీకొనటంతో చాతకొండ 6వ బెటాలియన్‌కు చెందిన టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ నునావత్‌ పాండ్యా(38) మృతి చెందాడు. ప్రస్తుతం భద్రాచలం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పాండ్యా శనివారం సాయంత్రం సారపాకలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. రాత్రి 10.30 గంటల సమయంలో తిరిగి తన బావమరిది భూక్యా వినోద్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై భద్రాచలం వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరి బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాండ్యా తీవ్రంగా గాయపడ్డాడు. మోటార్‌సైకిల్‌పై వెనుక కూర్చున భూక్యా వినోద్‌కు స్వల్పగాయాలయ్యాయి.

మరో మోటార్‌ సైకిల్‌పై ఉన్న కోమటిరెడ్డి రాఘవరెడ్డి, నాగార్జునరెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పాండ్యాను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా తల్లాడ సమీపంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బూర్గంపాడు సివిల్‌ ఆస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం తుళ్లూరు గ్రామపంచాయతీలోని ఎర్రమట్టితండాకు చెందిన పాండ్యా పేద గిరిజన కుటుంబానికి చెందినవాడు. మృతుడికి భార్య కుసుమ, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై సంతోష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement