దర్జాగా చోరీలు! | Sakshi
Sakshi News home page

దర్జాగా చోరీలు!

Published Sat, Mar 17 2018 12:33 PM

Robbery In Tv Show room - Sakshi

మేడికొండూరు:  వరుస దొంగతనాలతో మేడికొండూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గురువారం అర్థరాత్రి సిరిపురం వద్ద ఉన్న ఇందిరా ఏజెన్సీస్‌ దుకాణంలో దొంగలు విజృంభించి నాలుగు విలువైన టీవీలను అపహరించారు. గ్రామానికి చెందిన నాగభైరు సురేష్‌ ఇందిరా ఏజెన్సీస్‌ పేరిట ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.  గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కూత వేటు దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం దుకాణంలో ఏదో పని ఉందని వచ్చి చూసేసరకి షట్టరు తాళాలు పగలగొట్టటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లూస్‌ టీం పరిసరాలను పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నమోదయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తొలుత ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించి టివీలు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఒక వ్యక్తి ముఖానికి మాస్కు, చేతి వేలిముద్రలు పడకుండా గ్లౌజులు వేసుకొంటున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు నాలుగు విలువైన టీవీలు పోయాయని బాధితుడు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో పోలీసులు సరైన గస్తీ కాయకపోవడంతో దొంగలు విజృంభిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దొంగల బెడదతో రాత్రివేళల్లో నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement