కరుణించిన న్యాయదేవత; సల్మాన్‌కు బెయిల్‌ | Sakshi
Sakshi News home page

జింకల వేట కేసు; సల్మాన్‌కు బెయిల్‌

Published Sat, Apr 7 2018 3:14 PM

Salman Khan Gets Bail In BlackBuck Poaching Case - Sakshi

జోధ్‌పూర్‌: ఒక రోజు ఆలస్యమైనా న్యాయదేవత కరుణించింది. కృష్ణ జింకల వేట కేసులో దోషి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది. నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్‌ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది.

హైడ్రామా: గురువారం నాటి తీర్పుతో జైలుపాలైన సల్మాన్‌.. శుక్రవారమే బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ పెట్టుకున్నారు. అయితే న్యాయమూర్తుల బదీలల కారణంగా ఆ రోజు విచారణలేవీ జరగలేదు. కృష్ణ జింకల వేట కేసును విచారిస్తోన్న జడ్జి రవీంద్ర కుమార్‌ జోషి కూడా బదిలీ కావడంతో శనివారం కోర్టు పనిచేస్తుందా, లేదా అనే సంశయం నెలకొంది. కానీ అనూహ్యంగా జడ్జి జోషి కోర్టుకు వచ్చి విధులు నిర్వర్తించారు. రూ.25 వేల విలువైన రెండు బాండ్లు, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దనే నిబంధనలపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరుచేశారు. సూపర్‌ స్టార్‌కు బెయిల్‌ వచ్చిందన్న వార్తపై అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

20ఏళ్ల నాటి కేసు: 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’  సినిమా షూటింగ్‌ కోసం జోధ్‌పూర్‌ వెళ్లిన చిత్రబృందం.. విరామ సమయంలో ఆటవిడుపుగా వేటకు వెళ్లి అరుదైన కృష్ణ జింకలు రెండిటిని చంపేశారని అభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్ల విచారణ అనంతరం జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు గురువారం(ఏప్రిల్‌ 5న) తుది తీర్పు చెప్పింది. సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్లు జైలు పడగా, మిగతా నిందితులైన సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, సోనాలీ బిద్రేలను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది.

Advertisement
Advertisement