స్కూల్‌ బస్సు, ట్యాంకర్‌ ఢీ | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు, ట్యాంకర్‌ ఢీ

Published Wed, Mar 14 2018 12:45 PM

School bus, tanker collide - Sakshi

భూత్పూర్‌ (దేవరకద్ర): బడి ముగించుకుని ఆడుతూ పాడుతూ సాయంత్రం ఇంటికి వెళ్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.. ఏం జరి గిందో తెలియదు.. పెద్ద శబ్ధం.. అద్దాలు పగిలిపోయి గాజుపెంకులు కళ్లకు తగులుకుంటూ వెళ్లాయి. భయాందోళనలతో ఒకటే అరుపులు కేకలు.. కానీ ఎవరికీ ఏం కాలేదు.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. ఇంతకు ఏం జరిగిందంటే భూత్పూర్‌ మండలం అమి స్తాపూర్‌ గ్రామంలో  మంగళవారం సాయంత్రం స్కూల్‌ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. రెండు వాహనాల వేగం బాగానే ఉండటంతో స్కూల్‌ బస్సు డ్రైవర్‌ సుల్తాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పిల్లలంతా వెనకసీటుల్లో కూర్చోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రమాదానికి కారణాలు.. 
మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనుల్లో భాగంగా రోడ్డును సగం తొలగించి పైప్‌లైన్‌ పనులు చేపట్టారు. పనులు ఇంకా పూర్తికాక నిర్వాహకులు రోడ్డును డైవర్షన్‌ చేశారు. దీంతో వాహనాలు ఒకే దారిలో వెళ్లాల్సి వస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ నుంచి భూత్పూర్‌ వైపుకు వస్తున్న హిరా మోడల్‌ స్కూల్‌ బస్సును ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ సుల్తాన్‌ సీటు లో ఇరుక్కుపోయాడు. దారిగుండా వెళ్తు న్న వాహనదారులు, గ్రామస్తులు వెంట నే డ్రైవర్‌ను బయటకు లాగి అంబు లెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ పంకజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.   

ఆందోళనలో విద్యార్థులు,  తల్లిదండ్రులు 
సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌కు రక్తగాయాలు కావడంతో అంకుల్‌.. అంటూ కేకలు పెట్టారు. గమనించిన అమిస్తాపూర్‌ వాసులు విద్యార్థులను బస్సులోంచి దించి సముదాయించారు. ప్రమాదం వార్త తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు సైతం వెంటనే అక్కడికి వచ్చి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.  


                                         ఆందోళనకు గురైన విద్యార్థులు

నోటీసులు జారీ చేశాం 
పనులు త్వరితగతిన పూర్తికాకపోవడంతో గతంలో పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తూ అధికారులు, కాంట్రాక్టర్‌ పనితీరును తప్పుపట్టారు. ఇదిలాఉండగా ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ స్పందించారు. గతంలో రోడ్డు డ్రైవర్షన్‌ను త్వరగా తొలగించాలని ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోవడంతో పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఇకనైనా పనులు వేగంగా చేసి డైవర్షన్‌ తొలగించాలని కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement