ఆశ్రమంలో శిష్యురాళ్లపై లైంగిక దాడులు | Sakshi
Sakshi News home page

ఆశ్రమంలో శిష్యురాళ్లపై లైంగిక దాడులు

Published Fri, Jan 12 2018 3:43 PM

sevadars raping three woman disciples

పాట్నా: బీహార్‌లోని నవడా జిల్లాలోని ఓ ఆశ్రమంలో ముగ్గురు శిష్యురాళ్లపై సామూహిక లైంగిక దాడి జరిగింది. సంత్‌ కుటీర్‌ ఆశ్రమంలోని కొందరు సేవాదార్లు డిసెంబర్‌ 12-17 మధ్య కాలంలో తమపై పలుమార్లు ఆశ్రమంలోనే అత్యాచారం జరినట్లు ముగ్గురు మహిళలు తమకు ఫిర్యాదు చేశారని జిల్లా పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. డిసెంబర్‌ 12వ తేదీన తాము వంటశాలలో భోజనం తయారీలో నిమగ్నమై ఉండగా సేవాదార్లులో కల్పానాథ్‌ చౌదరి, గిరిజాశంకర్‌ చౌదరి, తపస్యానంద్‌, షీట్‌ చౌదరి అనేవారు బలవంతంగా లోపలికి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించి తుపాకులు ఎక్కుపెట్టి తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళలు వివరించారన్నారు.  బాధితులు ఈనెల 4వ తేదీన తమకు ఫిర్యాదు చేశారని, నిందితులపై కేసు నమోదు చేశామని, వారంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లానుంచి వచ్చిన వారని, పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. వీరి కోసం గాలించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు నవడా ఎస్పీ వికాస్‌ బర్మన్‌ తెలిపారు. విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారంటూ బాధితులు గురువారం నవడా సివిల్‌ కోర్టులో తమ వాంగ్మూలాలు ఇచ్చారని, వారికి సదర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించామని వివరించారు. కాగా, ఆ​శ్రమంలో ఇలాంటి అకృత్యాలు ఇదే మొదటిసారి కాదని, కొన్ని నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారం జరిగిందని, తుపాకితో బెదిరించడంతో ఆమె మౌనం వహించిందని, కొంతమంది ఎదురు తిరగగా నిందితులు కాల్పులు జరపడంతో ఒకరు గాయపడ్డారని ఈ ముగ్గురిలో ఓ మహిళ చెప్పింది. ఆశ్రమంలో 50మంది మహిళలు, డజను మంది పురుషులు ఉంటారని, ఆరేళ్లుగా ఈ ముగ్గురు అక్కడ ఉంటున్నారని పోలీసు అధికారి తెలిపారు.

Advertisement
Advertisement