పేపర్‌ లెస్‌ విధానానికి అలవాటుపడాలి    | Sakshi
Sakshi News home page

పేపర్‌ లెస్‌ విధానానికి అలవాటుపడాలి   

Published Wed, Jun 20 2018 11:26 AM

Should Be utilized Technology : CP Karthikeya - Sakshi

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అన్ని పోలీస్‌స్టేషన్‌లో ఇక నుంచి పేపర్‌ లెస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనరేట్‌ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ డివిజన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు.

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పేపర్‌ లెస్‌ విధానాన్ని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అందుకోసం సంబంధిత అధికారులు పోలీస్‌స్టేషన్‌లో కేసుల అన్ని వివరాలు ట్యాబ్స్‌ లేదా, ప్యాడ్‌లను ఉపయోగించాలన్నారు. ఇందులో పోలీస్‌స్టేషన్‌లో కేసుల వివరాలు, కోర్టు పనులలో అన్ని విషయాలను పొందుపర్చాలన్నారు. దీంతోపాటు క్రైం క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌ వర్కింగ్‌ సిస్టంలో పోలీస్‌స్టేషన్‌లోని ఎఫ్‌ఐఆర్, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు.

జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసులను త్వరగా పూర్తి చేసి దోషులను అరెస్టు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూఎస్‌లపై ప్రత్యేకంగా డివిజన్‌ పరిధిలో టీమ్స్‌లు ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి లాడ్జీల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నేరాలు అరికట్టేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను పక్కగా నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. 
అదే పనిగా నేరాలకు అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. 

సమావేశంలో అదనపు డీసీపీలు శ్రీధర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి, ఆర్మూర్, బోధన్, ఏఆర్‌ ఏసీపీలు శివకుమార్, రఘు, సీహెచ్‌ మహేశ్వర్, అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, సీసీఆర్‌బీ ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్, ఆర్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement