పట్టుచీరల దొంగలు అరెస్టు | Sakshi
Sakshi News home page

పట్టుచీరల దొంగలు అరెస్టు

Published Wed, Mar 7 2018 8:23 AM

Silk Sarees Stolen Thieves Arrest - Sakshi

ధర్మవరం అర్బన్‌: పట్టుచీరలు దొంగిలించే ఐదుగురిని ధర్మవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 184 పట్టుచీరలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ వివరాలను ఇన్‌చార్జ్‌ డీఎస్పీ రామవర్మ  మంగళవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ధర్మవరం పట్టణానికి చెందిన గిరక నరేష్, చింతాకుల రాజ్‌కుమార్, పప్పూరు షఫీ, మాయకుంట చక్రవర్తి, ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు జనవరి 23న అర్ధరాత్రి వరలక్ష్మి థియేటర్‌ సమీపంలోని ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో గల చీరల పాలిష్‌ షాపు బీగాలు పగులగొట్టి, అందులోని 63 పట్టుచీరలు అపహరించారు.

ఫిబ్రవరి 12 అర్ధరాత్రి బలిజ కల్యాణమంటపం సమీపంలోని ఆనందం సిల్క్స్‌ దుకాణం తాళాలు పగులగొట్టి 140 పట్టుచీరలను దొంగిలించారు. మొత్తం 203 పట్టుచీరలు, పవర్‌లూమ్స్‌ చీరలు దొంగతనం చేశారు. సోమవారం సాయంత్రం ఐదుగురు దొంగలూ ఎర్రగుంటలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఉండగా పట్టణ సీఐ హరినాథ్, ఎస్‌ఐలు జయానాయక్, శ్రీహర్షలు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 184 పట్టుచీరలు, పవర్‌లూమ్స్‌ చీరలు రికవరీ చేశారు. వీటి విలువ రూ.1.69 లక్షలు ఉంటుందని ఇన్‌చార్జి డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement