మందలించిన మామను హత్య చేసిన అల్లుడు | Sakshi
Sakshi News home page

మందలించిన మామను హత్య చేసిన అల్లుడు

Published Thu, Sep 12 2019 11:26 AM

Son In Law Murdered His Uncle At Manthani - Sakshi

సాక్షి, మంథని: కాపురంలో కలహాలు లేకుండా కూతుర్ని బాగా చూసుకోవాలని మందలించిన మామను.. అల్లుడు హత్యచేసిన సంఘటన మంగళవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి గ్రా మంలో జరిగింది. మంథని సీఐ మహేందర్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బిల లక్ష్మయ్య(55)కు భార్య, కూతురు, ఇద్దరు కూమారులు. 2006లో కూతురు సుమలతను పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన బాసనేని శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెండ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాస్‌ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. ఈక్రమంలో పదినెలల క్రితం భార్యాపిల్లలతో వచ్చి అత్తగారి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివా సముంటున్నాడు.

తాగుడుకు బానిసైన శ్రీనివాస్‌ ఈమధ్యకాలంలో సుమలతను కొట్టడంతో ఆమె తండ్రి, తల్లి, సోదరులు వెళ్లి అడిగే క్రమంలో ఇరువురి మధ్య ఘర్ణణ జరిగింది. బావమరిది మహేశ్‌ మూలంగా తన తలకు గాయమైందని శ్రీనివాస్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ గొడవ జరిగినప్పటి నుంచి అత్తింటివారిని చంపుతానని శ్రీనివాస్‌ బెదిరించేవాడు. మంగళవారం రాత్రి పనికి వెళ్లి వచ్చిన శ్రీనివాస్‌ అత్తింట్లో ఉన్న భార్యాపిల్లలను తను అద్దెకు ఉండే గది రావాలని కబురు పంపడంతో మామ లక్ష్మయ్య వారిని దింపి వెళ్తున్నాడు. ఈక్రమంలో పాత కక్షను మనసులో పెట్టుకున్న శ్రీనివాస్‌ ఒంటరిగా ఉన్న మామపై గుర్తుతెలియని ఆయుధంతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పారిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు. 

Advertisement
Advertisement