భోజనానికి వెళ్లి వచ్చేలోపే ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Oct 12 2017 7:19 AM

student commited to suicide in nuziveedu iiit - Sakshi

సాక్షి, నూజివీడు: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సాగిరెడ్డి పూర్ణలక్ష్మీనరసింహమూర్తి (16) బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన మూర్తి కృష్ణా జిల్లా నూజివీడులోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతూ.. ఐ–3 హాస్టల్‌ రెండో అంతస్తు రూమ్‌ నంబరు ఎస్‌–69లో ఉంటున్నాడు. ఇతనితో పాటు మరో నలుగురు కూడా ఉంటున్నారు.

ఇతర విద్యార్థులు భోజనానికి వెళ్లిన సమయంలో మూర్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భోజనం ముగించుకుని వచ్చిన విద్యార్థులు ఫ్యాన్‌కు వేలాడుతున్న అతన్ని కిటికీలో నుంచి చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ సిబ్బంది గది తలుపులు తెరిచి వెంటనే అంబులెన్సులో పట్టణంలోని అమెరికన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మూర్తిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఐ ఎం రామ్‌కుమార్‌ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ట్రిపుల్‌ ఐటీకి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మూర్తి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందీ తెలియరాలేదు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరగతులు నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement