సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు | Sakshi
Sakshi News home page

సూర్యలంక బీచ్‌లో విద్యార్థి గల్లంతు

Published Mon, Jun 11 2018 1:07 PM

Student Missing In Suryalanka Beach Guntur - Sakshi

గుళ్ళపల్లి(చెరుకుపల్లి): అమ్మ వెళ్లొస్తానని చిరునవ్వుతో వెళ్లిన కన్నబిడ్డ కనపడకుండా పోయాడన్న వార్త విని ఆ తల్లి తల్లడిల్లింది. కుమారుడు సరదాగా స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. మండలంలోని మెట్టగౌడవారిపాలెం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్, ఉషారాణి దంపతులకు కుమార్తె వీణ, కుమారుడు పవన్‌(18) సంతానం. శ్రీనివాస్‌ ఆర్మీలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందాక గుళ్లపల్లిలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు.

పవన్‌ ఖాజీపాలెం కేవీఆర్, కేవీఆర్‌ అండ్‌ ఎంకేఆర్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా బాపట్లలోని సూర్యలంక బీచ్‌ సముద్ర స్నానానికి వెళ్లాడు. నీళ్లలో మునుగుతుండగా అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి గల్లంతైపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం రాత్రి వరకు సముద్రంలో గాలించినా పవన్‌ ఆచూకీ కనిపించలేదు. తిరిగి సోమవారం రాత్రి గాలింపు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

మూడు కుటుంబాలకు ఒక్కడే వారసుడు
దాసరి శ్రీనివాసరావు అన్నదమ్ములు ముగ్గురికీ పవన్‌ ఒక్కడే వారసుడు. పవన్‌ సముద్రంలో గల్లంతు కావడంతో ఆ మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement