అవును ఆమె ‘కథ’ చెప్పింది | Sakshi
Sakshi News home page

అవును ఆమె ‘కథ’ చెప్పింది

Published Thu, Aug 15 2019 6:56 AM

Students Dont Like to Study And Play Korean Drama in Hyderabad - Sakshi

పంజగుట్ట: చదువు భారమై ఓ విద్యార్థిని ఆడిన కిడ్నాప్‌ డ్రామా  పంజగుట్ట పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే .. గుంటూరుకు చెందిన (18) యువతి సోమాజిగూడ, విల్లామేరీ కాలేజీలో బీఎస్‌సీ కంప్యూటర్‌ చదువుతూ ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటోంది. కాలేజీకి వరుస సెలవులు ఉండడంతో గత వారం లింగంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె 12న సాయంత్రం హాస్టల్‌కు వచ్చింది. అదే రోజు సాయంత్రం గమ్‌ తెచ్చుకునేందుకు హాస్టల్‌ సమీపంలోని స్టేషనరీ షాప్‌కు వెళ్లి వచ్చింది. హాస్టల్‌ మెట్లు ఎక్కుతుండగా అక్కడికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి  పక్కనే ఉన్న ఆంబులెన్స్‌లో మీ బంధువులు ఉన్నారని అని చెప్పడంతో సదరు యువతి అంబులెన్స్‌ వద్దకు వెళ్లగానే వెనుకనుంచి ఒకరు అంబులెన్స్‌లోకి నెట్టారని, లోపల ఉన్న మరో వ్యక్తి స్ప్రె చల్లడంతో స్పృహ కోల్పోయానని, తనకు స్ఫ్రహ వచ్చి చూసే సరికి ఒక ఓ గదిలో ఉన్నానని, తన రోల్డ్‌గోల్డ్‌ చెవిదిద్దులు, సెల్‌ఫోన్‌ కనిపించలేదని తెలిపింది. తనకు భయం వేసి అక్కడనుంచి పారిపోయానని, రోడ్డుపై వెళ్లే వారి సాయంతో ఆటోలో సికింద్రాబాద్, అక్కడి నుంచి ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో కాచిగూడ వెళ్లి రైలులో గుంటూరుకు వెళ్లినట్లు తెలిపింది. మంగళవారం తన తండ్రికి విషయం చెప్పడంతో అతను సదరు యువతితో కలిసి పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇదీ అసలు విషయం..
 కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు యువతిని తీసుకుని ఆమె పేర్కొన్నట్లుగా కిడ్నాప్‌ జరిగిన ప్రాంతానికి వెళ్లి సీసీ కెమరాలను పరిశీలించారు. అయితే ఆ ప్రాంతంలో అంబులెన్స్‌ జాడ కనిపించలేదు. అక్కడనుండి యశోధా ఆసుపత్రి, మోనప్ప సర్కిల్‌ వరకు  సీసీ కెమరాలను పరిశీలించగా ఆమె ఒక్కరే హాస్టల్‌ నుంచి బేగంపేట మెట్రో వరకు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. అసలు ఆమె స్టేషనరీ షాప్‌కు వెళ్లనేలేదు. ప్యారడైజ్‌ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుని అక్కడినుంచి గుంటూరుకు వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెను నిలదీయగా ఇంటర్‌ వరకు బాగానే చదువుకున్నానని, అయితే కంప్యూటర్‌పై పట్టు లేకపోవడం, తీవ్ర ఒత్తిడి పెరగడం, కాలేజీలో అందరూ ఉన్నత వర్గాలకు చెందిన వారు ఉన్నందున వారితో కలవలేకపోతున్నట్లు తెలిపింది.  హాస ్టల్‌లో ఉండటం ఇష్టం లేక ఈ నాటకం ఆడినట్లు తెలిపింది. ఒక్క అబద్దం ఆడితే ఇన్ని అబ ద్దాలకు దారితీస్తుందనుకోలేదని పేర్కొంది. 

Advertisement
Advertisement