Sakshi News home page

పెళ్లి నింపిన విషాదం

Published Fri, Dec 15 2017 2:59 AM

The tragedy is filled with wedding - Sakshi

భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): వారు వరుసకు బావా మరదళ్లు.. చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల్లో చెలరేగిన గొడవల కారణంగా ఆ ప్రేమ పెళ్లిదాక వెళ్లలేదు. దీంతో అమ్మాయికి వేరే అబ్బాయి తో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న అబ్బాయి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం రాపాకపల్లి గ్రామానికి చెందిన గొల్లెన శైలజ (19)కి ధర్మసాగర్‌ మండల కేంద్రానికి చెందిన వల్లెపు శ్రీకాంత్‌ (21) వరుసకు బావామరదళ్లు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారి ద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ఇటీవల ఇరు కుటుంబాల్లో జరిగిన గొడవలతో పెళ్లికి బ్రేక్‌ పడింది.

ఈ నేపథ్యంలో శైలజ సోదరుడు రఘుపతి భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బొంత కుమార్‌ (21)తో శైలజ వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకాంత్‌.. శైలజను వివాహం చేసుకునే కుమార్‌కు ఫోన్‌ చేశాడు. తాను శైలజను ప్రేమించానని, పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో నిరాశ చెందిన శ్రీకాంత్‌ అక్టోబర్‌ 31న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చేసుకోబోయే యువతిని మరో యువకుడు ప్రేమించడం, అతను ఫోన్‌ చేయడం అనంతరం ఆత్మహత్యకు పాల్పడటంతోపాటు కలత చెందిన కుమార్‌ ఈ నెల 13న బీరులో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మూలానా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయంపై విరక్తి చెందిన శైలజ 13న రాత్రి ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.  

Advertisement
Advertisement