ఉరివేసుకుని టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య

Published Thu, May 24 2018 9:44 AM

TTD Employee Commits Suicide In Chittoor - Sakshi

తిరుపతి అర్బన్‌: స్థానిక కరకంబాడి రోడ్డులోని టీటీడీకి చెందిన ఎస్వీ పూర్‌ హోమ్‌లో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న పి.శంకర్‌(37) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  హోమ్‌ సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శంకర్‌ భార్య ప్రసన్నకుమారి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. శంకర్‌పై అత్తగారింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నడుస్తోంది. భార్య మృతి అనంతరం శంకర్‌ మద్యానికి బానిసయ్యాడు.

మనోవేదనతో ఉండేవాడు. అతనితో సరదాగా ఉండే పూర్‌హోమ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ కూడా 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శంకర్‌ మరింత కుంగిపోయాడు. బుధవారం కూడా సహ సిబ్బందితో, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో మాట్లాడుతూ గడిపాడు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ముళ్లచెట్ల పొదల మధ్య ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఫిర్యాదుతో అలిపిరి ఎస్‌ఐ శ్రీనివాసులు, టీటీడీ విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.

మృతుని జేబులో సూసైడ్‌ నోట్‌
మృతుని జేబులోని సూసైడ్‌ నోట్‌ ఉండడాన్ని అధికారులు గుర్తిం చారు. అందులో తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఉంది. ఆ పేపర్‌తో పాటు జేబులోని ఇతర కాగితాలను అలిపిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్‌హోమ్‌లో అధికారుల వేధింపులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement