యువ నేతలపై కాల్పులు.. హత్య | Sakshi
Sakshi News home page

ఎన్సీపీ నేతలపై కాల్పులు.. హత్య

Published Sun, Apr 29 2018 1:10 PM

Two NCP Activists Were Shot Dead In Ahmednagar - Sakshi

సాక్షి, ముంబై : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఇద్దరు కార్యకర్తలను తుపాకీతో కాల్చి హత్యచేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శనివారం సాయంత్రం అహ్మద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా... యోగేశ్‌ అంబదాస్‌ రాలేభట్‌(30), రాకేశ్‌ అర్జున్‌ రాలేభట్‌(23) జాంఖేడ్‌ గ్రామస్తులు. యోగేశ్‌ ఎన్సీపీ జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌గా, రాకేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు శనివారం సాయంత్రం రోడ్డుపై నిల్చుని ఉండగా... ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి వారిపై తుపాకులతో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. అనంతరం వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని, హత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి రాం షిండే ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్సీపీ కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు వారాల క్రితం శివసేనకు చెందిన ఇద్దరు కార్యకర్తల్ని చంపిన ఘటనను మరువక ముందే మళ్లీ అదే తరహాలో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

Advertisement
Advertisement