సాక్షి, యశవంతపుర: లారీ- కారు ఢీకొని ఇద్దరు టెక్కీలు మృతిచెందిన సంఘటన కెంగేరి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. యశవంతపురకు చెందిన జి.ప్రకాశ్(27), అక్షయకుమార్(25)లు బన్నేరఘట్ట రోడ్డులో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.
బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇండికా కారులో ఇంటికి వెళ్తూ నైస్ రోడ్డు వృషభారతి రాజకాలువ వద్ద లారీని ఓవర్టెక్ చేయబోయి మరో లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్నారు. ఈ సంఘటనలో కారు... లారీ కిందికి దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ముందు సీటులో కూర్చున్న జి.ప్రకాశ్, అక్షయకుమార్లు అక్కడిక్కడే మృతి చెందారు. విపరీతమైన మంచు వల్ల ముందు వెళ్తున్న వాహనాలు కనపడకపోవటం, అతివేగం ప్రమాదానికి కారణమని కెంగేరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రమాదం కారణంగా సుమారు రెండు గంటలపాటు నైస్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీఐ కె.ఎస్.జయరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.