Sakshi News home page

యువతిపై అగంతకుడి దాడి

Published Thu, May 3 2018 9:25 AM

Unknown Person Knife Attack On Young Woman - Sakshi

వరదయ్యపాళెం: మండల కేంద్రమైన వరదయ్యపాళెంలో బుధవారం యువతిపై అగంతకుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జెడ్పీటీసీ సభ్యురాలు రావూరి సరస్వతమ్మ కుమారుడు కరుణాకర్‌ నాయుడు స్థానిక ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆయన బుధవారం బంధువుల ఇంటిలో జరిగే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంట్లో ఆయన రెండో కుమార్తె సౌందర్య ఒక్కటే ఉంది.

ఈ క్రమంలో ఓ అగంతకుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. యువతి తప్పించుకుని ఇంటి మరో ద్వారం నుంచి బయటకు వచ్చి కేకలు వేసింది. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో సౌందర్య రెండు చేతులపై కత్తిగాట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు తెలిపి, ఇంటికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ హరిప్రసాద్‌ పరిశీలించి అగంతకుడి కోసం పరిసరాల్లో గాలించారు. దుండగుడు లుంగీ, చొక్కా ధరించి ఉన్నాడని, హిందీలో మాట్లాడుతున్నట్లు ఆ యువతి వివరించింది. ఇది పార్థీ గ్యాంగ్‌ పనికాదని ఎస్‌ఐ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన తీరు పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉందని, విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement