భర్త ఫోన్‌ రిసీవ్‌ చేయలేదని భార్య ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్త ఫోన్‌ రిసీవ్‌ చేయలేదని భార్య ఆత్మహత్య

Published Sat, Jun 1 2019 11:39 AM

Wife Suicide While Husband Not Answering Calls Anantapur - Sakshi

కణేకల్లు:  భర్త తన ఫోన్‌ రిసీవ్‌ చేయలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్, లక్ష్మీ అలియాస్‌ ధనలక్ష్మీ (28) దంపతులు. ఇద్దరూ కూలిపని చేసి జీవనం సాగిస్తున్నారు. రాజశేఖర్‌ తల్లిదండ్రులు మణెమ్మ, ప్రకాష్‌లు బతుకుతెరువు కోసం కర్నూలుకెళ్లారు. వారు అక్కడే పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్‌కు డబ్బు అవసరం కావడంతో తల్లిదండ్రుల వద్దకెళ్లి తెచ్చుకొనేందుకు మంగళవారం కర్నూలుకు వెళ్లాడు. అదే రోజు ఇంటికి తిరిగి వస్తానని భార్యకు చెప్పాడు. అయితే అక్కడ డబ్బు సర్దుబాటు కాలేదు. తల్లిదండ్రులు డబ్బు సమకూరగానే మేమే ఊరికొస్తాం... వెళ్లు అని కొడుక్కు చెప్పారు.

డబ్బు అత్యవవసరం కావడంతో సర్దుబాటయ్యాకే ఊరికెళ్తానని అతను అక్కడే ఉండిపోయాడు. ఇంటికి వెంటనే తిరిగొస్తానని చెప్పిన భర్త మరుసటి రోజైనా రాలేదు. లక్ష్మీ ఫోన్‌ చేసి అడిగితే డబ్బు సర్దుబాటు కాలేదు.. అయ్యాక వస్తా... నీవేమీ ఫోన్‌ చేయొద్దని చెప్పాడు. అయితే మనసు ఆగలేక లక్ష్మీ  గురు వారం ఉదయం అనేక మార్లు భర్తకు ఫోన్‌ చేసింది. రాజశేఖర్‌ ఫోన్‌ రిసీవ్‌ చేయలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీ విషపుగుళికలు మింగింది. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement