కవల బిడ్డలతో మహిళ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కవల బిడ్డలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Published Wed, Apr 18 2018 7:28 AM

Woman Commits Suicide With Twin Child - Sakshi

రెంటచింతల: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా మనువాడిన భర్తే పుట్టింటివారు పెట్టిన  భూమిని అమ్ముకుని రావాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో పాలుపోక ఆరేళ్ల వయసున్న కవలపిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని రెంటాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సోమ ఆంజనేయులు, మంగమ్మల కుమార్తె కృష్ణవేణిని హైదరాబాదులో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న బత్తుల వెంకట రఘుకు ఇచ్చి 11 సంవత్సరాల కిందట వివాహం చేశారు. కృష్ణవేణికి తల్లిదండ్రులు అరెకరం భూమిని కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో భర్త వెంకట రఘు గత కొంతకాలంగా పుట్టింటివారు పెట్టిన భూమిని అమ్ముకుని రావాలని కృష్ణవేణిని ఒత్తిడి చేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే మూడు రోజుల కిందట కృష్ణవేణి పిల్లలతో సహా పుట్టింటికి వచ్చి తన గోడును  తల్లిదండ్రులతో మొర పెట్టుకుంది. మంగళవారం యథావిధిగా పొలం వెళ్లి మంచినీటి కోసం ఇంటికి వచ్చిన తల్లి మంగమ్మ తలుపులు తీయగానే ఎదురుగా ఇద్దరు పిల్లలతోసహా కృష్ణవేణి ఉరివేసుకుని ఉండడం  గమనించింది. ఇరుగు పొరుగువారిని కేకలు వేసి పిలిచి వెంటనే వారిని రెంటచింతలలోని ప్రయివేటు ఆస్పత్రికి,  అక్కడనుంచి మెరుగైన వైద్యం కోసం  పిడుగురాళ్లలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పిడుగురాళ్లలో బత్తుల కృష్ణవేణి, ఆమె కుమార్తె నాగజ్యోతి, కుమారుడు జయంత్‌ చికిత్స పొందుతున్నారు. గురజాల రూరల్‌ సీఐ బి.నర్సింహారావు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. ఎస్‌ఐ వై.కోటేశ్వరరావు పిడుగురాళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement