ఊరంతా షాక్‌.. మహిళ మృతి

26 May, 2019 02:07 IST|Sakshi

పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్‌): ఊరంతా షాక్‌ రావడంతో.. ఓ మహిళ మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో శనివారం ఈ సంఘటన చోటుచేసు కుంది. కొత్తపేటకు చెందిన పెద్ద శంకరయ్య, శంకరమ్మల మూడో కూతురు పద్మజ(38)ను పదేళ్ల క్రితం బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గుంటి నిరంజన్‌కి ఇచ్చి వివాహం చేశారు. అయితే తల్లిగారింటికి వచ్చిన పద్మజ శనివారం ఉదయం దుస్తులు ఉతికి.. ఇంటి ముందున్న తీగపై ఆరబెడుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.

పద్మజకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పద్మజ భర్త నిరంజన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ కుర్మయ్య తెలిపారు. ఇదే సమయంలో ఊరంతా షాక్‌ వచ్చిందని, కొన్ని రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఎర్తింగ్‌ సమస్యతో షాక్‌ వస్తోందని గ్రామస్తులు తెలిపారు.   

మరిన్ని వార్తలు