చెన్నై , సేలం: సేలం– విరుదాచలం రైలు పట్టాలపై యువకుడి తల, మొండం విడివిడిగా పడి ఉన్నాయి. ఇది హత్యా, ఆత్మహత్యా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. సేలం జిల్లా వాల్లప్పాడి సమీపం ముత్తంపట్టిలో సేలం– విరుదాచలం రైల్వే ట్రాక్ ఉంది. ఈ పట్టాలపై శుక్రవారం ఉదయం తల, మొండెం విడివిడిగా పడిన స్థితిలో ఒక యువకుడి మృత దేహం కనిపించింది. గమనించిన వారు సేలం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్కు తరలించారు.
తర్వాత పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించగా అక్కడ ఒక కళాశాల గుర్తింపు కార్డు కనిపించింది. దాని ఆధారంగా ఆ యువకుడి మృతదేహం సేలం జిల్లా వాల్లప్పాడి సమీపంలోని సింగిపురానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు గుహన్రాజ్ (19)ది అని తెలిసింది. ఇతను రాశిపురంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. గుహన్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా అతడిని హత్య చేసి పట్టాలపై పడుకోబెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక తరువాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.