యువకుడి ప్రాణాలు బలిగొన్న ఫ్లెక్సీ కర్రలు | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణాలు బలిగొన్న ఫ్లెక్సీ కర్రలు

Published Fri, Apr 6 2018 1:48 PM

Young Man Died In Road Accident - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ :  మున్సిపల్‌ శాఖ, ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో గుర్తింపు తెచ్చుకోడానికి ఆ పార్టీ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు  ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...

పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనిలో నివాసముంటున్న బూతరాజు వేణు(25) తన ద్విచక్ర వాహనంపై అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌రోడ్డు మీదుగా చింతపల్లికి వెళుతున్నాడు. ఈ క్రమంలో హనుమాన్‌పేట ఫ్లై ఓవర్‌పై ఫ్లెక్సీకర్రల లోడుతో నిలిపిన టాటాఏసీ ఆటోను వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న ఫ్లెక్సీ కర్రలు వేణు ఛాతిభాగంలో దిగాయి. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 108సహాయంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

మృతుడికి 15రోజుల క్రితమే వివాహం..

కాగా బూతరాజు భిక్షం, యాదమ్మలకు కుమార్తె, ఇద్దరు కుమారులు వారిలో రెండోవాడైన  వేణు పట్టణంలో ఎలక్ట్రికల్‌ హౌసింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  గత నెల 14వ తేదీన డదేవులపల్లి గ్రామానికి చెందిన అనూషతో వివాహం అయింది. కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement