సాక్షి, చెన్నై : సెల్ఫోన్ చోరీ వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన గుమ్మడిపూండిలో సోమవారం రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. బిహార్లోని సిక్కిందర్ మండలానికి చెందిన శశికుమార్ (22) సిప్కార్ట్ పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గుమ్మడిపూండి ఆంజనేయర్ ఆలయ వీధిలో అద్దె ఇంటిలో ఉంటున్నాడు. అతని ఇంటి సమీపంలో ఒడిశాకు చెందిన అజయ్తో సహా కొందరు కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో అజయ్ సెల్ఫోన్ చోరీ అయ్యింది. పక్క ఇంటిలో ఉంటున్న రాజేష్ చోరీ చేశాడని, అతనితో అజయ్ సోమవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ రాజేష్కుమార్కు మద్దతుగా వాగ్వాదం చేశాడు. దీంతో వారి మధ్య రగడ ఏర్పడింది.
ఆగ్రహం చెందిన అజయ్ స్నేహితులు కలిసి శశికుమార్పై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇన్స్పెక్టర్ జయకుమార్ ఏడుగురిని విచారణ చేస్తున్నారు. శశికుమార్ మృతి చెందిన సంగతి గురించి అతని బంధువులకు తెలియచేశారు.