ప్రేమించి.. పెళ్లాడి.. పరారయ్యాడు | Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లాడి.. పరారయ్యాడు

Published Thu, Jan 25 2018 12:09 PM

young woman complaint on husband - Sakshi

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌) : నువ్వంటే ఇష్టమని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకలేనని.. నీతోనే నా జీవితమని నమ్మబలికాడు.. ప్రేమించి, పెళ్లాడి చివరకు పరారయ్యాడు. కండ్రిక ప్రాంతంలో ఓ యువతిని మోసం చేసి పరారైన ఓ ప్రబుద్ధుడి వైఖరి ఇదీ. వివరాల్లో కెళ్తే. కండ్రిక కాలనీకి చెందిన కర్రా బాలమ్మ (20) తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు చేతోడు వాదోడుగా ఉండేందుకు బాలమ్మ కూడా కేటరింగ్‌ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుండేది. ఈ పనుల్లో భాగంగా గతేడాది గుంటూరు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ చిలకలూరిపేటకు చెందిన కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆమెతో పరిచయం చేసుకొని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన ఆమె సరే అంది.

దీంతో ఆరు నెలల కిందట అతగాడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని కండ్రికలో కాపురం పెట్టాడు. పెళ్‌లైన మొదట్లో బాగానే ఉన్న కిరణ్‌ ఆ తరువాత భార్య బాలమ్మను కట్నం డబ్బులు కావాలంటూ వేధిస్తూ ఉండేవాడు. కూలి పనులు చేసుకునే మా తల్లిదండ్రులు అంత డబ్బులు ఇవ్వలేరంటూ ఆమె చెప్పుకుంటూ  వస్తుంది. ఈ నెల 3వ తేదీన కిరణ్‌ చిలకలూరిపేటలోని తన ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్లు చేస్తే నిన్ను వదిలేసా, డబ్బులిస్తేనా వస్తానంటూ చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేసాడు. దీంతో అతడి ఆచూకీ కోసం వెతుకులాడిన ఆమె విసుగుపోయి బుధవారం నున్న పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement