- ఆకలితో అలమటించినా..పట్టించుకొనేవారు లేరు..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ):
ఆకలితో అలటించినా వాటిని పట్టించుకొనే నాధుడే లేడు. గత నాలుగు రోజులుగా హోరున వర్షం కురుస్తుండంతో వాటికి కనీసం గడ్డి కూడా వేసిన దాఖలాలు లేవు. వాటి పరిసరాలు కూడా దారుణంగా ఉండడంతో అవి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయి. స్థానిక నాగమల్లితోట జంక్షన్లో ఉన్న జిల్లా జంతుహింస నివారణ సంఘంలో ఉన్న వందలాది మూగ జీవాలు ఆలనా పాలనా చూడకపోవడంతో మంగళవారం ఒక్క రోజే సుమారు 20 మూగజీవాలు మృతి చెందాయి. జిల్లాలో అక్రమంగా లారీల్లో తరలిస్తున్న వాటిని పట్టుకొని పోలీసులు ఇక్కడకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం వీటి సంరక్షణకు ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో వీటి సంరక్షణ విషయాన్ని నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. కేవలం దాతలు అందించే గ్రాసంతో ఈ మూగజీవాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
ఆధ్వానంగా పారిశుద్ధ్యం...
జంతుహింస నివారణ సంఘ ఆవరణ పారిశుద్ధ్యం ఆధ్వానంగా తయారయింది. మూగజీవాలు కనీసం పడుకొనేందుకు కూడా వీలు లేకుండా తయారయింది. ఈ బురదలోనే మూగజీవాలు నరకయాతన పడుతున్నాయి. ఉన్న షెడ్లు మూగజీవాలకు సరిపోకపోవడం ... ఆరుబయటకు వచ్చేందుకు ప్రయత్నించినా వర్షం పడడంతో ఇరుకు గదుల్లో అవి నరకయాత అనుభవించాయి. దీనికితోడు పశుగ్రాసం అందకపోవడంతో చనిపోయాయి.